
స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 14: రూపాయి ఆదాయం లేనిదే ఏ పని చేయని ఈ రోజుల్లో గత 3 సంవత్సరాలుగా ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నార్కట్పల్లిలో ప్రతిరోజు ఉదయం 8:30 నిమిషాలకు నిత్యం జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తూ ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కలుపుకొని జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా కృషిచేసి ప్రతిరోజు కొంతమంది కొత్త వ్యక్తులలో జాతీయ భావాన్ని పెంచుతూ దేశ సమైక్యతకు పాటుపడుతున్న నార్కెట్పల్లి జనగణమన ఉత్సవ సమితి సభ్యులను స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ అభినందించారు. ఉత్సవ సమితి సభ్యుల సేవలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ నాయకులు గురువారం దేశ ప్రధాని మోడీ పిలుపుమేరకు నిర్వహించిన తిరంగా ర్యాలీ సందర్భంగా స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ చేతుల మీదుగా శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ ప్రతిరోజు ఖచ్చితమైన సమయానికి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని క్రమశిక్షణతో ప్రతిరోజు ఈ కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి విజవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షులు కన్నెబోయిన నరసింహ మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మరెన్నో అవాంతరాలను తట్టుకొని ప్రతినిత్యం జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభం లేకున్నా నిత్యం క్రమం తప్పకుండా నిస్వార్ధంగా సహకరించే సభ్యులు మరికొందరు ఈరోజు అందుబాటులో లేకపోయినప్పటికీ వారు ప్రతి రోజు చేస్తున్న సేవలు అమోఘమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్యులు పాల్వాయి భాస్కరరావు, నల్లగొండ నాగరాజు, పల్లెర్ల నాగరాజు, పల్లెర్ల సత్యనారాయణ, మునుకుంట్ల గణేష్, బిల్లకంటి శ్రీకాంత్, ముంత నరసింహ, మల్లెబోయిన రామలింగం, వడ్డేగోని రామలింగం, పాలకూరి రమేష్, పామనగుండ్ల శివ, సాయి, ఉండ్రాతి అంజి, తదితరులు పాల్గొన్నారు.
