
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 14: సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి బడుగు బలహీన వర్గాల ఆర్దిక అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతో దోహదం చేస్తాయని సాయి నిధి మ్యూచువల్లీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ గుంతకండ్ల సైదులు పేర్కొన్నారు. 72వ అఖిలభారత సహకార వారోత్సవాల లో భాగంగా శుక్రవారం నార్కెట్పల్లిలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించిన అనంతరం సైదులు మాట్లాడుతూ సహకార వ్యవస్థతో సమాజాభివృద్ధి సాధ్యమని భావించిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి అత్యున్నత నమ్మకమైన సహకార విధానం కూలిపోతే గ్రామీణ ప్రజల ఆశలు ఫలవంతం కావని అన్నారని తెలిపారు. గత 72 సంవత్సరాలుగా భారతదేశ గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకార వ్యవస్థ చేదోడు వాదోడుగా నిలిచిందని పేర్కొన్నారు. చిన్న చిన్న మొత్తాల పొదుపు విధానం భవిష్యత్తులో పెద్ద నిధిగా అవతరించి అత్యవసర పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తద్వార ప్రజలు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం బ్రాంచ్ మేనేజర్ చెరుకుపల్లి సైదులు ఉద్యోగులు మీనయ్య, మౌనిక, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
