
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి జులై 29: నార్కెట్పల్లి మండల కేంద్రంలోని స్పూర్తి కాలేజీ పక్కన గురిజ అశోక్ స్వామి నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి రేణుక ఎల్లమ్మ, కాళీమాత విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఊరేగింపు సందర్భంగా భక్తులు తమ ఇంటి ముందుకు వచ్చిన దేవతా విగ్రహాలకు నీళ్లు ఆరబోసి, కొబ్బరికాయ కొట్టి, నివాళులు అర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారి గుడి ప్రాంగణం నుంచి నార్కట్పల్లిలోని బొడ్రాయి వరకు ఊరేగింపు నిర్వహించి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమం లో దాండియా కళాకారుల ప్రదర్శన, చిడతల భజన ఆహుతులను ఆకట్టుకున్నది.

మంగళవారం ఉదయం గణపతి పూజ, సకల దేవతా హోమాలు తదితర కార్యక్రమాలను శతాధిక ప్రతిష్టాచార్యులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి బృంద సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి విగ్రహాలకు పై బియ్యం, పువ్వులు, పండ్లు, నవధాన్యాలు సమర్పించి తమ మొక్కలు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకుడు అశోక్ స్వామి మాట్లాడుతూ బుధవారం ఉదయం అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
