నార్కట్పల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలి

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 12, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో గత ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు గత 14 నెలలుగా చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం నార్కెట్పల్లి మండల అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు చిరుమర్తి యాదయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో వాహనదారులు ప్రమాదాలకు గురై కాళ్లు చేతులు విరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. బస్సు డిపో వద్ద ఇరుకు రోడ్డుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాహనాలు వెళ్లే సమయంలో వచ్చే దుమ్ముతో ఎంతోమంది స్థానిక ప్రజలు వ్యాపారులు శ్వాసకోశ వ్యాధికి గురవుతున్నారని తెలిపారు. వెంటనే విస్తరణ పనులు చేపట్టకుంటే అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 14న స్థానిక మునుగోడు రోడ్డు నుంచి అమ్మనబోలు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి బయన్న, వెంపటి శ్రీనివాస్, మేడబోయిన శ్రీనివాస్, లింగాల యాదయ్య, కొప్పు శ్రవణ్, ఆమనగంటి ఐలయ్య, గూడూరు అంజిరెడ్డి, మునుకుంట్ల గణేష్, నడింపల్లి శ్రవణ్, బొల్లెద్దు రామలింగం, పుల్లెంల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *